మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్యాల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను స్థానిక మార్కండేయ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు శివనామ స్మరణ చేసుకుంటూ ఊరేగింపుగా ఎదుర్కొని, ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అధిష్టింపజేశారు. అనంతరం పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆదిదంపతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. దేవతామూర్తులను భక్తులు కనులారా చూసి పరవశించి పోయారు.